కరీంనగర్/తిమ్మాపూర్, ఏప్రిల్ 8 (జాగో న్యూస్): ప్రజాస్వామ్యం పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర కీలకం అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఎల్ ఎండి కాలనీలోని అరుంధతి ఫంక్షన్ హాల్లో మానకొండూరు నియోజకవర్గ పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పాత్రికేయుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభమైన మీడియా పాత్ర కీలకమని, నియోజకవర్గంలోని పలు సమస్యలను పరిష్కరించే విధంగా పాత్రికేయులు కృషి చేయాలని సూచించారు. భూ సమస్యలు, ప్రజల సమస్యలు ఏవి ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి తప్పక కృషి చేస్తానని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి, మండలాల వారీగా ప్రెస్ క్లబ్ ల నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల పాత్రికేయులు పాల్గొన్నారు.
