అగ్ని ప్రమాదాల నివారణపై విస్తృతంగా అవగాహన కల్పించాలి.. * జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, ఏప్రిల్ 15 (జాగో న్యూస్): అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ సిబ్బంది కఠోరంగా శ్రమిస్తూ ఆస్తులు, ప్రజలను కాపాడడం వారి తెగువకు నిదర్శనమని, అద్భుతంగా సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలందరికీ విస్తృతంగా అగ్నిమాపక అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. సోమవారం కరీంనగర్ లోని కాశ్మీర్ గడ్డ ఫైర్ స్టేషన్ లో అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫైర్ సేఫ్టీ కిట్ల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక్కొక్క పరికరానికి సంబంధించిన పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. వాటికి సంబంధించిన ఉపయోగాలను జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకన్న జిల్లా కలెక్టర్ కు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఎన్ సీ సీ కెడేట్లు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, స్వశక్తి మహిళలు, మున్సిపల్, విద్యుత్ సిబ్బంది, ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఫైర్ సిబ్బంది చేరుకునే లోపే సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ కిట్ల పనితీరుపై అవగాహన పెంపొందించాలని సూచించారు. అగ్నిమాపక శాఖ అధికారులు బ్రోచర్లు, వాల్ పోస్టర్ల ద్వారా జనసంచారం ఉన్నచోట, సినిమా హాళ్లలో ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఫైర్ సిబ్బంది ఆపద సమయంలో అందిస్తున్న సేవలపై మీడియాకు సమాచారం ఇవ్వాలని సూచించారు. టీం వర్క్ తోనే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని, అత్యుత్తమ సేవలందిస్తూ ముందుకెళ్లాలని పేర్కొన్నారు. కరీంనగర్ లో ప్రైవేట్ హాస్పిటల్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్స్ ల్లో ఫైర్ సేఫ్టీ కిట్ల పనితీరు తెలుసుకునేందుకు తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఫైర్ ఆఫీసర్ ను ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్లు ఏర్పాటు చేసుకోకపోతే వాటిని ఏర్పాటు చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యగా బీమా సౌకర్యం చేసుకునే అంశంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముంటుందని, భీమా సౌకర్యం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని హాస్పిటళ్ళు, కమర్షియల్ బిల్డింగ్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బందికి తమ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. సిబ్బంది అందిస్తున్న సేవలను జిల్లా కలెక్టర్ కు ఫైర్ ఆఫీసర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజేయ్ యాదవ్, జిల్లా ఫైర్ ఆఫీసర్ తగరం వెంకన్న, సిపిఓ కొమురయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, వయోజన విద్య డిడి జయశంకర్, బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ ప్రకాశ్, ఎన్ వై కే కోఆర్డినేటర్ వెంకట రాంబాబు, జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ డీ ప్రభాకర్, కరీంనగర్, మానకొండూర్ ఫైర్ ఆఫీసర్లు గుండయ్య, బీ బూదయ్య, అధికారులు, ఫైర్ సిబ్బంది, తదితరులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు