కరీంనగర్, ఏప్రిల్ 16 (జాగో న్యూస్): శాతవాహన విశ్వవిద్యాలయం లో 16 -4 -2024న మహనీయుల జయంతోత్సవాలు (మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రి బాయ్ పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావ్, కొమరం భీమ్ మరియు చాకలి ఐలమ్మ) SC/ST, BC మరియు NSS సెల్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ లైబ్రరీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. సభా అధ్యక్షత వహించిన రిజిస్ట్రార్ ఆచార్య వరప్రసాద్ మాట్లాడుతూ దేశమంతా మహనీయుల జయంతులను జరుపుకోవాలని వారి సేవలను గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉపకులపతి ఆచార్య మల్లేష్ సంకశాల మాట్లాడుతూ మహనీయుల జయంతులను జరుపుకోవడం ద్వారా వారి ఆలోచనా విధానాలను మన జీవితానికి అన్వయించుకొని సమాజంలోని అసమానతలను నిర్మూలించాలని సమ సమాజ నిర్మాణానికి మార్గాలు కల్పించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆచార్య అడప సత్యనారాయణ ఉస్మానియా విశ్వవిద్యాలయం మాట్లాడుతూ ఆధునిక భారతదేశంలో అత్యంత ప్రభావశీలి మరియు దార్శనికుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు మరియు ఆయన భారతదేశానికి చూపిన మార్గదర్శనాన్ని ముందుకు తీసుకు వెళ్ళడమే మహనీయులకు మనమిచ్చే గౌరవం అని అన్నారు. ఆచార్య గోన నాయక్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వడమే ధ్యేయంగా పూలే దంపతులు జీవించారని మహిళలకు విద్యా అందించాలని అకుంఠిత దీక్షతో పనిచేశారని మహిలా సాధికారణ కొరకు పోరాటం చేశారన్నారు. ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ కే పద్మావతి మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లతో దేశం ముందుకు వెళుతుందని అందరికీ సమాన అవకాశాలు రిజర్వేషన్ల వల్లనే వచ్చాయని అన్నారు. జాతీయ సేవా పథకం సమన్వయ అధికారి డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ మహనీయులంతా దేశ ప్రగతి కోసం సామాజిక న్యాయం కోసం అనేక రుగ్మతలను రూపుమాపడం కోసం ముందుండి సేవ చేశారని వారిని విద్యార్థులంతా ఆదర్శంగా తీసుకొని కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. అనంతరం ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎం సరసిజ, ఆర్ట్స్, సైన్స్ కామర్స్ కళాశాలల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కే తిరుపతి, డి విజయ ప్రకాష్, డి విజయ్ కుమార్, శాతవాహన విశ్వవిద్యాలయ ప్రాంగణ కళాశాలల ప్రిన్సిపల్స్ అధ్యాపకులు, మరియు విద్యార్థి ని విద్యార్థులు పాల్గొన్నారు.
