కరీంనగర్, ఏప్రిల్ 19 (జాగో న్యూస్): జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వి. పద్మావతి, జిల్లా మార్కెటింగ్ అధికారి శుక్రవారం చొప్పదండి మండలంలోని పలు ధాన్యం సేకరణ కేంద్రాలను సందర్శించారు. జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా కొంత మంది జిల్లా అధికారులను రెండు మూడు మండలాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు. జిల్లా మార్కెటింగ్ అధికారిని చొప్పదండి, కరీంనగర్ రూరల్ మరియు కొత్తపల్లి మండలాలకు ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ మేరకు నగునూర్, కొలిమికుంట, గుమ్లాపూర్, భూపాలపట్నం, వెదురుగట్టలో పిఎసిఎస్, ఐకెపి, డిసిఎంఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తీవ్రమైన ఎండలు ఉన్నందున ప్రతి సెంటర్ లో మంచినీళ్ళు ,ఓఆర్ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాలనీ, ఉదయం పది పదకొండు గంటలలోపే తూకాలు పూర్తి చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. సాయంత్రం ఎండ తీవ్రత తగ్గిన తరువాతే మళ్ళీ ప్రారంభించాలని ఆదేశించారు. . ప్రతి సెంటర్ కి పాడీ క్లీనర్లు ఏర్పాటు చ చేశామని, రైతులు ధాన్యాన్ని తప్పనిసరిగా వీటి ద్వారా శుభ్రం చేసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని టార్పాలిన్లను అందుబాటులో ఉన్నాయా లేదా పరిశీలించారు. తూకంలో కోత లేకుండా, రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత సెంటర్ ఇన్చార్జిలదేనని తెలిపారు. రైస్ మిల్లర్లు ఎవరైనా ధాన్యాన్ని దింపుకోవడంలో ఇబ్బందులకు గురి చేస్తే ఉత్తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం నర్మదా పాల్గొన్నారు. అనంతరం మార్కెటింగ్ అధికారి చొప్పదండి వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. మొక్క జొన్న, పప్పు ధాన్యాలు, ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. ప్రైవేటు వ్యాపారస్తులు ధాన్యం కొనుగోళ్లలో రైతులను నష్టపరచకుండా తగు చర్యలు తీసుకోవాలని కార్యదర్శిని ఆదేశించారు.
