కరీంనగర్, ఏప్రిల్ 29 (జాగో న్యూస్): కాకతీయ యూనివర్సిటీ వరంగల్ సెనెట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన లౌకిక విలువలు – సాహిత్యం అనే సదస్సు జరుగుతున్న సందర్బంగా ఫాసిస్టు మూకలు, ప్రముఖ కవులు డాక్టర్ పసునూరి రవీందర్, నరేష్ కుమార్ సూఫీ, మెర్సీ మార్గరెట్ మీద దాడి చేసి గాయపర్చడాన్ని, సదస్సును అడ్డుకోవడాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ తీవ్రంగా ఖండించారు. దేశంలో, రాష్ట్రములో లౌకిక ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని, రాజ్యాంగ స్ఫూర్తితో సాహిత్య సదస్సు జరుగు తుంటే, ఫాసిస్టు మూకలు దాడికి పాల్పడటం భావ ప్రకటనా స్వేచ్ఛ మీద దాడి చేయడమే అని అన్నారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఒకే భావజాలం కలిగిన వ్యక్తులు సమావేశాలు జరుపుకునే హక్కు ఉందని అలాంటి వాటిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు.ప్రగతిశీల ప్రజాస్వామిక ఉద్యమాలకు కేంద్రమైన వరంగల్ గడ్డమీద కవులు, మేధావుల మీద దాడి ప్రజాస్వామ్యానికి పొంచి వున్న ప్రమాదాన్ని స్పష్టం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు, ప్తజాస్వామిక వాదులు ఇట్టి దాడిని, ముఖ్యంగా బావ ప్రకటన స్వేచ్ఛ పై దాడి గా భవిస్తూ, ఈ దాడిని యావత్ తెలంగాణ సమాజం, ప్రజా సంఘాలు ఖండించాలని సృజన్ కుమార్ పిలుపునిచ్చారు.
