కరీంనగర్, ఏప్రిల్ 30 (జాగో న్యూస్): 2,3 సంవత్సరాల నుంచి ఫెయిల్ అయి పరీక్షలు రాయని విద్యార్థులు ఈసారి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం చాలా సంతోషకరమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మంచి లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో శ్రమిస్తూ దాన్ని సాధించాలని సూచించారు. మంగళవారం సాయంత్రం 10వ తరగతిలో ఫెయిల్ అయి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు లోకిని అంజలి, జే లావణ్య, కొక్కు మణికంఠ సాయికిరణ్, ఎస్డి తన్వీర్, బుష్రా ఫాతిమా, కవ్వంపల్లి శివను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా వారికి డిక్షనరీలను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 95 మంది విద్యార్థుల్లో 72 మంది ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. ఇందుకోసం కష్టపడ్డ ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వచ్చే సప్లిమెంటరీ పరీక్షల్లో మిగతా విద్యార్థులు పాస్ అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పాస్ కాని వారు నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా చూడాలని పేర్కొన్నారు. కష్టపడి చదువితే మంచి మార్కులు రావడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో జనార్దన్ రావు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ నరసింహస్వామి, ఏఎం ఓ అశోక్ రెడ్డి, ప్రభాకర్ రావు, హెచ్ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు.
