కరీంనగర్, ఏప్రిల్ 30 (జాగో న్యూస్): వారు పదో తరగతి పరీక్షలు రాశారు.. రెండు, మూడు సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు.. తర్వాత మళ్లీ పరీక్ష రాయాలనే ఆలోచన వారికి రాలేదు.. పరీక్ష ఫీజు కట్టలేక పోయారు.. ఏదో ఒక పని చేసుకుందాంలే అని ఊరుకున్నారు.. ఫీజు కట్టి పిల్లలు పాస్ చేయించి మంచి చదువులు చదివించాలనే ఆలోచన వారి తల్లిదండ్రులకు రాలేదు.. అలా రెండు, మూడు ఏండ్లు గడిచిపోయాయ్.. వారి అడ్రస్ లు కూడా విద్యాశాఖ అధికారులకు తెలియకుండా పోయాయి. వారిపై గత అసెంబ్లీ ఎన్నికల ముందు పదవీ బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దృష్టి పడింది. కనీసం పదో తరగతి పాసైనా ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకొని ఉపాధి పొందుతారనే ఆలోచన జిల్లా కలెక్టర్ కు వచ్చింది. ఆలోచన వచ్చిందే తడువుగా విద్యార్థులను ఎలాగైనా కన్విన్స్ చేసి పరీక్షలు రాయించి పాస్ చేయించాలని సంకల్పించారు. ఈ మేరకు వారి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. విద్యార్థులు పరీక్షలు రాసేలా వారిని ఒప్పించారు. వివరాలు తెలుసుకొని పరీక్ష ఫీజు చెల్లించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు జిల్లాలో ఫెయిల్ అయిన 124 మంది వివరాలు సేకరించారు. వారందరూ పరీక్షలు రాసేలా ఫీజులు చెల్లించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో ప్రత్యేకంగా ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించారు. వారు ఆయా సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. వార్షిక పరీక్షలకు వారిని అన్ని విధాలా సిద్ధం చేశారు.. 124 మందిలో 95 మంది విద్యార్థులు కరీంనగర్ ఓల్డ్ హైస్కూల్, హుజూరాబాద్ ప్రభుత్వ హైస్కూల్లో పరీక్షలు రాశారు. ఇందులో 72 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 40, బాలికలు 32 మంది పాసయ్యారు. 75.78 శాతం మేరకు ఉత్తీర్ణత సాధించారు. దీంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కృషి ఫలించింది. కలెక్టర్ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రత్యేక శ్రద్ధతో పదో తరగతిలో పాస్ అయ్యామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ స్ఫూర్తితోనే మరింత ఉన్నత చదువులు చదువుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
గ్రేట్ అచీవ్మెంట్..
ఇతరులకు విద్యార్థులు ఆదర్శం..
శ్రమిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు..
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
ఫెయిలైన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించడం చాలా ఆనందంగా ఉంది. గ్రేట్ అచీవ్మెంట్.. ఈ విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ను డీఈవో జనార్దన్ రావు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ నరసింహస్వామి కలిశారు. ఈ మేరకు వారు ఫెయిల్ అయిన విద్యార్థుల ఉత్తీర్ణతను కలెక్టర్ కు వివరించారు. సందర్భంగా విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విద్యార్థులు పాస్ కావడం చాలా హ్యాపీగా ఉంది.. గ్రేట్ అచీవ్మెంట్.. అని పేర్కొన్నారు. పరీక్షలు రాసిన 95 మందిలో 72 మంది పాస్ కావడం నిజంగా గ్రేట్ అని తెలిపారు. ఇందులో 75.78 శాతం ఉత్తీర్ణత సాధించడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కఠోర శ్రమ, పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని విద్యార్థులు నిరూపించారని పేర్కొన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు మళ్లీ సప్లిమెంటరీ పరీక్షల్లో అవకాశం కల్పించాలని ఆదేశించారు. పాసైన విద్యార్థులతో మళ్లీ పరీక్షలు రాయించి మరింత ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. త్వరలో విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో ఏడవ స్థానం సాధించినందుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి స్వీట్లు, బుక్స్ ను డీఈఓ అందజేశారు. 96. 65% ఉత్తీర్ణత సాధించారని జిల్లా కలెక్టర్ కు వివరించారు. వారికి కలెక్టర్ అభినందనలు తెలియజేశారు.