మే 20 (జాగో న్యూస్): దేవాలయాల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయాలని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పిలుపు నిచ్చారు. శనివారం కేరళలోని శ్రీ ఉడియన్నూర్ దేవి ఆలయం ప్రకటించిన అవార్డును సోమనాథ్ స్వీకరించారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో వస్తారని ఆయన ఊహించారు. కానీ వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల్లో గ్రందాలయాలు ఏర్పాటుతో యువతను ప్రార్థనా స్థలాలకు ఆకర్షించడానికి దోహదపడుతుందన్నారు. దేవాలయాలు నామ జపానికి (దేవుని నామ జపం) వచ్చే వృద్ధులకు మాత్రమే కాకుండా “సమాజాన్ని మార్చే” ప్రదేశాలుగా మారాలని అన్నారు. ఆలయ నిర్వాహకులకు, కమిటీలు, ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలు, దాతలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. యువత దేవాలయాల వైపు ఆకర్షితులు కావడానికి, వారి కెరీర్ను అభివృద్ధి చేసుకునేందుకు ఈ ఆలోచన దోహదపడుతుందన్నారు. ఆ దిశగా జరిపే కృషి విజయవంతమైతే సమాజంలో పెద్ద మార్పును చూడగలుగుతామన్న ఆశాభావాన్ని సోమనాథ్ వ్యక్తం చేశారు.*









