ఆవులను వధించకండి.. చట్టాలను గౌరవించండి..! * దేశ సమైక్యత, సమగ్రత కోసం నిషేధాజ్ఞలు ఉల్లంఘించకండి * మజ్లీస్ తహఫ్ఫుజ్ ఖత్మే నబువ్వత్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్ పిలుపు

కరీంనగర్, జూన్ 3 (జాగో న్యూస్): దేశంలోని చట్టాలను గౌరవిస్తూ, దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆవులను వధించకూడదని, ప్రభుత్వం నిషేధం విధించినపుడు, నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పుడునిబంధనలు ఉల్లంఘించకూడదని మజ్లిస్ తహఫ్ఫుజ్ ఖత్మే నబువ్వత్ రిలీజియస్ ట్రస్ట్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రేకుర్తి మదర్సా అరబియా హిఫ్జుల్ ఖురాన్ ప్రిన్సిపాల్ ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ యావత్తు ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. సోమవారం ముఫ్తి ఘియాస్ మాట్లాడుతూ త్వరలో పవిత్ర బక్రీద్ మాసం రాబోవుతుందని, బక్రీద్ మాసంలో ఖుర్బానీ (బలి) ఇచ్చే జంతువుల్లో ఆవులను వధించకూడదని, ఇది చట్టరీత్యా నేరమన్నారు. ఇటువంటి సున్నిత విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇస్లాం ధర్మం ప్రకారం మనం చేసే పనులు, కార్యక్రమాలతో సమాజంలో నివసించే ఇతర ధర్మం ప్రజల మనోభావాలకు ఇబ్బంది కలుగకుండా ఉండాలని, ఆవిధంగా జీవించాలని మహానీయ మహమ్మద్ ప్రవక్త (సల్లం) సెలవిచ్చారని పేర్కొన్నారు. ఇస్లాం సంస్కృతి, సాంప్రదాయలకు పెట్టింది పేరని, ఇస్లాంకు విరుద్ధంగా ప్రవర్తించడానికి వీలు లేదన్నారు. బక్రీద్ లో పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించాలని కోరారు. బక్రీద్ మాసం దృష్ట్యా గోవులను ఈనెల రోజుల పాటు వార సంతల్లో విక్రయించకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, గో రక్షకుల ముసుగులో చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ లకు విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు