కౌంటింగ్ కు అంతా రెడీ.. * జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు * 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. * సీపీ అభిషేక్ మోహంతి

కరీంనగర్, జూన్ 3 (జాగో న్యూస్): ఈనెల 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపునకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సారథ్యంలో యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 13వ తేదీన పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 17,97,150 మంది ఓటర్లు ఉండగా, 13,03,690 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 72.54 నమోదయింది. వయోవృద్ధులు దివ్యాంగులు 1625 మంది ఉండగా, హోమ్ ఓటింగ్ ద్వారా 1560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సిబ్బంది 10, 200 మంది ఉండగా 8,811 మంది, సర్వీస్ ఓటర్స్ 1018 మంది ఉండగా, 476 మంది ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఈ మేరకు ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఓట్ల లెక్కింపునకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సారథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనల మేరకు సర్వం సిద్ధం చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరుగా ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 395 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 18 టేబుల్స్ 22 రౌండ్లు, చొప్పదండి లోని 327 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్, 24 రౌండ్లు, వేములవాడ లోని 260 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్ 19 రౌండ్స్ వారీగా ఓట్లను లెక్కించనున్నారు. సిరిసిల్ల 287 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్ 21 రౌండ్స్, మానకొండూర్ 316 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్ 23 రౌండ్స్, హుజురాబాద్ 305 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్ 22 రౌండ్స్, హుస్నాబాద్ 304 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్ 22 రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఆయా పార్టీల అభ్యర్థులు, ఏజెంట్ల కోసం సీట్లు కేటాయించారు. లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్తు నిరంతరయంగా ఉండేలా చర్యలు అధికారులు తీసుకుంటున్నారు. కౌంటింగ్ కోసం సిబ్బందిని నియోజకవర్గంలో వారీగా సైతం అలాట్ చేశారు. దీనికోసం సెకండ్ రాండనైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పమేలా ఆధ్వర్యంలో నిర్వహించారు. కౌంటింగ్ సూపర్వైజర్స్ 124 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 124, మైక్రోఅబ్సర్వర్లు 124 మందిని కేటాయించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ సూపర్వైజర్స్ 21, కౌంటింగ్ అసిస్టెంట్లు 35, మైక్రో అబ్జర్వర్లు 14 మందిని అలాట్ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటలకు వీరిని టేబుల్స్ వారీగా కేటాయించనున్నారు. వీరందరికీ ఇప్పటికే ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇచ్చారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఎనిమిదిన్నర గంటల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల ఫలితాలను రౌండ్ల వారీగా ప్రకటించనున్నారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు ఫలితాలను ఎన్నికల కమిషన్ వెబ్సైట్ తో పాటు ఎంకోర్ సాఫ్ట్వేర్ లో నమోదు చేయనున్నారు. కరీంనగర్ సీపీ అభిషేక్ మోహంతి ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మంగళవారం 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ ఎదుట ఉన్న రోడ్డుపై రాకపోకలకు అనుమతి లేదు. ఈ మేరకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లకు గుర్తింపు కార్డులను అందిస్తున్నారు. గుర్తింపు కార్డులు లేని ఏజెంట్లు, సిబ్బందిని అనుమతించేది లేదని అధికారులు సూచించారు. సోమవారం ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పమేలా సాధారణ ఎన్నికల పరిశీలకులు అమిత్ కటారియా, కౌంటింగ్ పరిశీలకురాలు జీ నజ్మాతో కలిసి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మొత్తానికి ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు