కరీంనగర్, జులై 23 (జాగో న్యూస్): గ్రామాలు, పట్టణాల్లో ఆదాయాన్ని మరింత పెంపొందించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పేర్కొన్నారు. ఆర్థికంగా బలోపేతం అయ్యేలా కృషి చేయాలని సూచించారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, వివిధ శాఖల అధికారులతో స్థానిక సంస్థల విధులు- బాధ్యతలపై రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, అధికారుల నుంచి విధులు, బాధ్యతలు, ఆదాయం పెంచే మార్గాలపై సూచనలు సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడకుండా సానికల సంస్థలు మరింత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు. స్థానిక సంస్థల ఆర్థికంగా బలోపేతం అవుతేనే రాష్ట్రము, దేశము పటిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలు అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను పెంచుకుంటూ ప్రగతి పతంలో పయనించాలని తెలిపారు. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న నిధులు సక్రమంగా వినియోగం అవుతున్నాయా లేదో అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. మంజూరైన నిధులు సక్రమంగా వినియోగించాలని, దుర్వినియోగం కాకుండా చూడాలని తెలిపారు. పక్కాగా వాటిపై ఆడిట్ నిర్వహించాలని, అన్ని రంగాలతో పాటు ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని పేర్కొన్నారు. గ్రామాలు, జిల్లాలు బలంగా ఉంటేనే రాష్ట్రము, దేశం బలంగా ఉంటుందని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంటుందని తెలిపారు. అధికారులు ఇచ్చిన సూచనలు సలహాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మాడల్ రిపోర్ట్ తయారు చేసి ఇస్తామని చెప్పారు. ఆదాయం పెంపుపై కొత్త కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు.
కరీంనగర్ కు మంచి కలెక్టర్ దొరకడం అదృష్టం..
కరీంనగర్ జిల్లాకు అన్ని అంశాలపై అవగాహన ఉన్న మంచి కలెక్టర్ పమేలా సత్పతి దొరకడం జిల్లా ప్రజల అదృష్టమని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పేర్కొన్నారు. అధికారుల సూచనల మేరకు జిల్లా కలెక్టర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉందని తెలిపారు. దేశ పునర్నిర్మాణంలో బ్యూరోకాట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కలెక్టర్లే గవర్నమెంట్ అని, ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టమని తెలిపారు. స్థానిక సంస్థల బలోపేతంపై ప్రభుత్వానికి అత్యుత్తమైన రిపోర్ట్ అందిస్తామని చెప్పారు.
కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి..
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ స్మితా సబర్వాల్
గ్రామాలు, పట్టణాల్లో ఆదాయం పెంచే మార్గాలపై అధికారులు కొత్త కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ స్మితా సబర్వాల్ సూచించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు ఫైనాన్స్ కమిషన్ కీలకపాత్ర పోషిస్తుందని, ఇది తమ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడం గొప్ప అనుభూతిని ఇస్తుందని, కరీంనగర్ గడ్డ తనకెంతో ఇష్టమని తెలిపారు. మున్సిపాలిటీల్లో అనవసర ఖర్చులు తగ్గించుకుంటూ, ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న వినూత్నమైన కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఇక్కడ వాటి అమలు చేయాలని పేర్కొన్నారు. హోటల్లల్లో వేస్టేజ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆ వేస్టేజ్ను తగ్గించాలని సూచించారు. కొత్త కొత్త ప్రయోగాలతోనే మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పారు. ఆ దిశగా అధికారులు ముందుకు సాగాలని సూచించారు. స్థానికంగానే ఆదాయం పెంచుకునే మార్గాలకు శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు.
మహిళల ఆర్థిక అభ్యున్నతికి చర్యలు..
స్థానిక సంస్థలు మరింత బలోపేతం..
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
గ్రామాలు, పట్టణాల్లో మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభిప్రాయపడ్డారు. మహిళా సంఘాల అభివృద్ధితోనే స్థానిక సంస్థలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. స్వశక్తి మహిళా సంఘాలు అప్పగించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారని కితాబు ఇచ్చారు. అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు, స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ పనులు అద్భుతంగా పూర్తి చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళలను కోటీశ్వరులు చేసే కార్యక్రమంలో భాగంగా ముందుకెళ్తున్నామని వివరించారు. స్థానిక సంస్థల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్ని అంశాలను కులంక్షంగా చర్చిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు ఏం రమేష్, సంకే పెల్లి సుధీర్ రెడ్డి, మాలోతు నెహ్రూ నాయక్, రామగుండం మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం చంద్రకళ, రాయికల్ చైర్మన్ మోర హనుమండ్లు, పెద్దపెల్లి అదనపు కలెక్టర్ అరుణశ్రీ, కరీంనగర్ అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, డిపిఓ రవీందర్, జెడ్పి సీఈవో లు శ్రీనివాస్, గౌతమ్ రెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని డిఆర్డిఓలు, సీఈవోలు డిపిఓలు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.