కరీంనగర్, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్): లంబాడా, బంజారా ప్రజలకు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు మాజీ మేయర్ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అడవి బిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడడం కోసం సేవ్ లాల్ చేసిన కృషి గొప్పదన్నారు. తన ప్రజలను బయటి సమాజం నుంచి అనుక్షణం రక్షించుకునే దిశగా సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితాంతం పోరాటం సాగించారన్నారు. ఆ దిశగా వారు కల్పించిన చైతన్యం, వారు చేపట్టిన కార్యాచరణ దేశవ్యాప్తంగా వున్న లంబాడా,బంజారాలకు రక్షణ కవచంగా నిలిచిందన్నారు. బంజారాలకు స్పూర్తి ప్రదాతగా నాటి కాలంలో వారు చేసిన కృషి, విశ్వవ్యాప్తంగా వున్న బంజారాలకు వారిని ఆధ్యాత్మిక గురువుగా, తమ ఆరాధ్య దైవంలా కొలిచేలా చేసిందని, సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. బ్రిటిష్ , మొగల్ పాలకుల మత మార్పిడికి వ్యతిరేకంగా పోరాటం చేసి , బంజారాలను సన్మార్గం వైపు మళ్లించి వారి చరిత్రను , సంస్కృతిని పరిరక్షించిన బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవ్లాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.
