కరీంనగర్/మానకొండూర్, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలంలో గల ఊటూరు, వీణవంక మండలంలోని చల్లూరులో గల ఇసుక క్వారీలను భూగర్భ, గనులు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం శ్రీధర్, మైనింగ్ శాఖ డైరెక్టర్ బి.ఆర్.వి.సుశీల్ కుమార్ శనివారం సందర్శించారు. ఇసుక నిలువలను, రికార్డులను పరిశీలించారు. వే బ్రిడ్జిలు, సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షించారు. రోజువారిగా ఇసుక డంపింగ్, రవాణా వివరాలకు సంబంధించిన రిజిస్టర్లు తనిఖీ చేశారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన చెక్ పాయింట్లను పరిశీలించారు. అంతకు ముందు కరీంనగర్ లోని ఆర్ అండ్ బి వసతి గృహంలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మర్యాద పూర్వకంగా కలిశారు. మొక్కతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇసుక యార్డులు, నిల్వల వివరాలను జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు కలెక్టర్ ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, అసిస్టెంట్ జియాలజిస్ట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
