*కార్మికులు పిల్లలను పాఠశాలకు పంపించాలి
*జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): పలస కార్మికుల పిల్లలు తల్లిదండ్రులతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉన్నందున వారికి ఇంగ్లీషులో బోధించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధంపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతిలో చదువుతున్న సుమారు వంద మంది వలస కార్మికుల పిల్లలకు కలెక్టర్ పమేలా సత్పతి స్కూల్ బ్యాగులు, డ్రాయింగ్ బుక్స్, క్రేయాన్స్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వలస కార్మికుల పిల్లల చదువును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల్లో 500 మందికి పైగా కార్మికుల పిల్లలకు బోధిస్తున్నామని తెలిపారు. ఈ విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్, డ్రాయింగ్ బుక్స్, క్రయాన్స్, స్టేషనరీ అందించామని తెలిపారు. వారు పనిచేస్తున్న ఇండస్ట్రీల యజమానుల సహకారంతో విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు అందజేస్తామని అన్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజనం అందజేస్తున్నామని అన్నారు. పిల్లలకు గణితంతో పాటు ఇంగ్లీష్ నేర్పించాలని ఆదేశించారు. కార్మికులు వారి పిల్లలను తప్పకుండా ఈ పాఠశాలలకు పంపించాలని కోరారు. కరీంనగర్ రూరల్ మండలంలో మొగ్ధంపూర్, బొమ్మకల్, చెర్లబూత్కూర్ ప్రభుత్వ పాఠశాలల్లో వలస కార్మికుల పిల్లలకు బోధిస్తున్నామని అన్నారు. కార్మికులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, సెక్టోరియల్ అధికారి ఎంఈఓ రవీందర్, ప్రధానోపాధ్యాయురాలు పద్మ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.