కరీంనగర్, ఏప్రిల్ 07 (జాగో న్యూస్): జిల్లాలో పనిచేస్తున్న సుమారు 2700 పారిశుధ్య కార్మికులందరికీ బీమా ప్రీమియం చెల్లించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. మరణించిన ఇద్దరు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబ సభ్యులకు సోమవారం ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ చెక్కులు పంపిణీ చేశారు. ఇల్లందకుంట మండలం మల్యాల కు చెందిన గురుకొండ రాజబాబు, శ్రీరాముల పల్లెకు చెందిన తిరుపతి మరణించగా వారి కుటుంబ సభ్యులకు పి.ఎం.జె.జె.బి.వై పథకం ద్వారా మంజూరైన రూ.రెండు లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఎందుకు సంబంధించిన ప్రీమియం గత ఏడాది జిల్లా యంత్రాంగమే చెల్లించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరంలో జిల్లా యంత్రాంగం తరపున జిల్లాలోని సుమారు 2700 మంది పారిశుద్ధ్య కార్మికులకు బీమా ప్రీమియం చెల్లించామని గుర్తు చేశారు. కార్మికుల నుండి ఒక్క రూపాయీ తీసుకోకుండా సుమారు పది లక్షల రూపాయల వరకు బీమా చెల్లి ప్రీమియం చెల్లించిందని అన్నారు. వివిధ కారణాలవల్ల కార్మికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. ఈ ఏడాది కూడా కార్మికులందరికీ బీమా ప్రీమియం జిల్లా యంత్రాంగం ద్వారానే చెల్లించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. హెల్త్ క్యాంపులు నిర్వహించి కార్మికులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని, అందరికీ హెల్త్ కార్డులు అందజేయాలని అన్నారు. గతంలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపుల ద్వారా కొందరు పారిశుధ్య కార్మికుల్లో టీబీ వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తున్నామని, న్యూట్రిషన్ కిట్టు తో పాటు ప్రతి నెలా వేయి రూపాయలు అందజేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ కార్మికులకు రూ.20 లక్షల బీమా ప్రీమియం చెల్లించిన మున్సిపల్ కమిషనర్ ఆయూబ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, ప్రపుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, డిటిడిఓ పవన్ కుమార్, ఆర్డిఓ మహేశ్వర్, యూనిసెఫ్ కోఆర్డినేటర్ కిషన్ స్వామి, ఎల్డీఎం ఆంజనేయులు పాల్గొన్నారు.
