కరీంనగర్, ఏప్రిల్ 07 (జాగో న్యూస్): ఈ నెల 20 నుండి నిర్వహించనున్న ఇంటర్, పదవ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఇంటర్ పదవ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రశ్నపత్రాలను, కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతరులు ఎవరూ కూడా పరీక్షా కేంద్రాల్లో ఉండరాదని, గుర్తింపు పొందిన వారిని తప్ప ఎవరినీ కేంద్రాలకు అనుమతించరాదని ఆదేశించారు. ఇంటర్ పరీక్షల కోసం జిల్లాలో 4 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, 881 మంది పరీక్ష రాస్తున్నారని తెలిపారు. 10వ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షల కోసం 3 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, 421 మంది పరీక్షలు రాస్తున్నారని అన్నారు. వేసవి దృష్ట్యా వైద్య శాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లను నియమించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట మహిళా పోలీస్ సిబ్బందికి డ్యూటీ కేటాయించాలని సూచించారు. కేంద్రాల్లో పరీక్ష రాసేవారికి అన్ని వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సిహెచ్ నాగేశ్వరరావు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.
