హైదరాబాద్ తరహా హైడ్రా చర్యలు మానకొండూర్ లో షురూ

*”ఎమ్మెల్యే ఆన్ వీల్స్”తో అక్రమాలపై సత్వర స్పందన
*కొత్తపల్లిలో ఆక్రమిత రోడ్డును తొలగించిన అధికారులు

కరీంనగర్/మానకొండూర్, జూన్ 14 (జాగో న్యూస్): మానకొండూర్ నియోజకవర్గంలో భూకబ్జాలకు పాల్పడే వారి పాలిట మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సింహస్వప్నంగా మారుతున్నారు. హైదరాబాద్ నగరంలో చేపడుతున్న హైడ్రా చర్యలను మానకొండూర్ లో అమలు చేయడం ప్రారంభమైంది. “ఎమ్మెల్యే ఆన్ వీల్స్” కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి పొందిన ఫిర్యాదులను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, తాజాగా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అక్రమ భూకబ్జాలపై దృష్టి సారించారు.

*అక్రమణ రోడ్డును పునరుద్ధరించిన అధికారులు*
కొత్తపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా ప్లాట్ల మధ్య రోడ్డు కోసం ప్రభుత్వ భూమిని మరియు రోడ్డును ఆక్రమించిన ఘటనపై గ్రామస్థులు “ఎమ్మెల్యే ఆన్ వీల్స్” ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో, అధికారులు సర్వే చేపట్టి తగిన చర్యలు ప్రారంభించారు. కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటీసులు జారీచేసి, అభ్యంతరాల కోసం గడువు నిర్దేశించిన అధికారులు, ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో రెవిన్యూ సిబ్బంది, ఎంపీడీవో, ఎంపీవో, సీఐ, ఎస్ఐ సమక్షంలో అక్రమంగా వేసిన రోడ్డును తొలగిస్తూ . ఊరి ప్రయోజనాల కోణంలో పాత నక్సా త్రోవను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

*అధికారుల ముందు తోకముడిచిన దోపిడీదారులు*
కార్యాచరణ సమయంలో ఆక్రమణకు పాల్పడిన తాజా మాజీ ప్రజాప్రతినిధి స్వల్పంగా హంగామా చేయగా, అధికారులు చట్టపరమైన చర్యలు తప్పవని గట్టి హెచ్చరికలు జారీ చేయడంతో వెంటనే వెనక్కు తగ్గారు. ఈ చర్యలపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

*అక్రమార్కులకు హైడ్రా తప్పకుండా వర్తిస్తుంది * : *ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి*

“రియల్ ఎస్టేట్ పేరుతో రాజకీయ ముసుగులో భూకబ్జాలు చేసే వారిని ఉపేక్షించబోము” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. “ప్లాట్ల పేరుతో ప్రభుత్వ భూములను, పేదల స్థలాలను ఆక్రమించే వారిపై హైదరాబాద్ తరహా హైడ్రా చర్యలు తీసుకుంటాం” అని ఆయన హెచ్చరించారు.

“ఇది ప్రారంభం మాత్రమే, మానకొండూర్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా ఇలాంటి అక్రమాలు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. ఊరి అభివృద్ధిని దెబ్బతీసే చర్యలను ఎవరు చేసినా ఉపేక్షించము. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న రోడ్డుపై త్వరలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి, భవిష్యత్తులో ఎవ్వరూ ఇలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా చర్యలు తీసుకుంటాం” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు