కరీంనగర్: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈనెల 27 నుండి వచ్చే నెల రెండు వరకు నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం అధికారులతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవల్లో నిజాయితీ పెంపొందించాలని అన్నారు. ప్రజా సేవలో పారదర్శకత, బాధ్యత చాలా ముఖ్యమని తెలిపారు. ప్రతి ఉద్యోగికి పనిలో జవాబుదారీతనం ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ హెల్ప్ లైన్ నెంబర్ 14432, లోగో కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఆర్డీవో మహేశ్వర్, జెడ్పీ సీఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








