కరీంనగర్, ఏప్రిల్ 19 (జాగో న్యూస్): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటికీ ఓటరు స్లిప్పులను బీఎల్ఓలతో పంపిణీ చేయించేందుకు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఓటరు జాబితాను ర్యాండమ్ గా రాజకీయ పార్టీల నేతలు చెక్ చేసుకోవాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పోలింగ్ బూత్ ల పేర్లు, స్థల మార్పిడి, అదనంగా ఏర్పాటు చేసే పోలింగ్ బూత్ ల అంశంపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కులంకషంగా చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికీ ఓటరు స్లిప్పులు పంపిణీ చేసే సమయంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు సిబ్బందితో వెంట ఉండి ఓటరు జాబితాను చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు. తద్వారా లోటుపాట్లు తలెత్తకుండా ఉంటాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసుకుంటే బాగుంటుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ బూత్ ల్లో ఓటర్లు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి ఎక్కువగా ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 85 సంవత్సరాలు దాటిన వృద్ధుల కోసం ఇంటి వద్ద ఓటు వేసేలా ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించిందని తెలిపారు. జిల్లాలో బెల్ట్ షాపులను అన్నింటిని మూసివేసామని పేర్కొన్నారు. గ్రామాల్లో అక్రమంగా మద్యం ఆమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను ఆయా రాజకీయ పార్టీల నేతలు పాటించాలని తెలిపారు. వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు. పోలింగ్ బూత్ ల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, దివ్యాంగుల కోసం వీల్ చైర్ లను కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. పలు సమస్యలను రాజకీయ పార్టీల నేతలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్, డిఆర్ఓ పవన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, ఆయా రాజకీయ పార్టీల నేతలు సత్తినేని శ్రీనివాస్, మడుపు మోహన్, కళ్యాడపు ఆగయ్య, వెంకటరమణ, నాంపల్లి శ్రీనివాస్, బర్కత్ అలీ, మిల్కురి వాసుదేవ రెడ్డి, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
