పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం..  * జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, ఏప్రిల్ 30 (జాగో న్యూస్): కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలను పకడ్బందీ గా నిర్వహిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. దీనికి ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులు అమిత్ కటారియా (ఐఏఎస్ అధికారి), అశ్వినీ కుమార్ పాండే హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులకు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 17,97,150 ఓటర్లు ఉన్నారని, ఇందులో మహిళలు 9,19, 565 మంది, పురుషులు 8,77,484 మంది ఉన్నారని తెలిపారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు మొత్తం 28 మంది పోటీలో ఉన్నారని చెప్పారు. ఎక్కువమంది పోటీలో ఉన్న దృష్ట్యా ఈ మేరకు అదనంగా ఈవీఎంలు అవసరమని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లను అవసరమైన మేరకు అదనంగా అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. హుజురాబాద్ ఎన్నికల్లో వాడిన 612 ఈవీఎంలను కూడా తెప్పిస్తున్నామని చెప్పారు. వీటితోపాటు 680 ఈవీఎంలను కూడా వాడుతామని పేర్కొన్నారు. 2194 పోలింగ్ స్టేషన్లకు అవసరమైన ఈవీఎంలు, వీవీ ఫ్యాట్స్ ను రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉంచుతామని వెల్లడించారు. ఓటర్లందరికీ ఓటరు స్లిప్పులను అందిస్తామని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు 10, 20 క్లస్టర్ బూతులకు ఒక ఏజెంట్ ను నియమించుకోవాలని రాజకీయ పార్టీల నేతలకు సూచించారు. 90 వేల ఓటర్ గుర్తింపు కార్డులను పోస్ట్ ద్వారా పంపించామని తెలిపారు. 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, 40 శాతం డిజబులిటీ ఉన్న దివ్యాంగులకు హోం ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. హోమ్ ఓటింగ్ కార్యక్రమం మే 3 నుంచి ఆరో తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. పోలింగ్ సిబ్బంది ఇంటికి వచ్చి ఓటు వేయిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా నాలుగు రోజుల్లో ఎవరైనా తప్పిపోయిన వారు ఉంటే 8వ తేదీన తిరిగి వారికి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ఇది ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ పరిధిలో 41 వేలమంది పిడబ్ల్యూడి ఓటర్స్ ఉన్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వయోవృద్ధులు 591 మంది, దివ్యాంగులు 1010, ఎసెన్షియల్ సర్వీసెస్ సిబ్బంది 24, పోలింగ్ అధికారులు, సిబ్బంది 8162 మంది, పోలీస్ సిబ్బంది 4057, అదనపు సిబ్బంది 1400 మంది మొత్తం 15,250 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కరీంనగర్ లోని సెయింట్ ఆల్ఫోన్స్ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. పార్లమెంట్ పరిధిలో 288 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. మొత్తం 2194 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 1590 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని తెలిపారు. 856 పోలింగ్ స్టేషన్లల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక నిఘా ద్వారా ఎన్నికలు సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్లను కరీంనగర్లో ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మానకొండూర్ నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ ను కరీంనగర్ లోని అంబేద్కర్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ మహిళ (ఎస్సీ) కళాశాలలో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. హుజరాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, వేములవాడ ప్రభుత్వ హైస్కూల్ లో, సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో, హుస్నాబాద్ మోడల్ స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తాగునీరు, విద్యుత్తు నీడ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. సివిజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై వెంట వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నగదు తో పాటు ఓటర్లను ప్రలోభపెట్టే సామాగ్రి తరలించకుండా 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు సిబ్బందిచే తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికలను మరింత ప్రశాంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నిబంధనలను పాటించాలని, వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

* ఏర్పాట్లు బాగున్నాయ్…
ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం పార్లమెంటు ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు ఏర్పాట్లు చేస్తున్నారని ఎన్నికల సాధారణ పరిశీలకులు ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా సంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులపై ఏ సమయంలోనైనా తనను ఫోన్లో సంప్రదించవచ్చని, లేదా నేరుగానైనా కలువవచ్చని సూచించారు. ప్రతిరోజు సాయంత్రం కరీంనగర్లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో సాయంత్రం నాలుగు నుంచి ఐదు మధ్యలో అందుబాటులో ఉంటానని చెప్పారు. 9177435833 తన మొబైల్ నంబర్ కు ఫిర్యాదులపై సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల నియమ, నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు.

* ఎన్నికల వ్యయంపై ఫిర్యాదు చేయవచ్చు..
వ్యయ పరిశీలకులు అశ్వినీ కుమార్ పాండే

అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించిన ఏమైనా ఫిర్యాదులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎన్నికల పరిశీలకులు అశ్వినీ కుమార్ పాండే సూచించారు. ప్రతి రోజు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు కరీంనగర్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎవరైనా నేరుగా గాని ఫోన్లో గాని ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. 9032659531 తన మొబైల్ నెంబర్ కు ఏ సమయంలో అయినా కాల్ చేయవచ్చని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎక్కడ ఉల్లంఘన జరిగిన తమకు సమాచారం ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఆర్ఓ పవన్ కుమార్, ఆర్డిఓ కే మహేశ్వర్, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు, సత్తినేని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మడుపు మోహన్, జి కొమురయ్య, టిడిపి ప్రతినిధి కళ్యాడపు ఆగయ్య, బిజెపి నాయకులు బాస సత్యనారాయణ రావు, బండ రమణారెడ్డి, ఎంఐఎం నేత అబ్బాస్ షమీ, సిపిఐ ఎం ప్రతినిధి నరేష్ పటేల్, ఎంపీ అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు,
సమాచార, పౌర సంబంధాల శాఖ కరీంనగర్ చే జారీ చేయనైనది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు