కరీంనగర్, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్): తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశాలు రెండవ రోజు ముకుందలాల్ మిశ్రా భవన్ సిఐటియూ జిల్లా కార్యాలయంలో కొనసాగాయి. రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆందోళన పోరాటాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగామ రాజమల్లు, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ గార్లు మాట్లాడుతూ… ప్రతి జిల్లా కేంద్రంలో ESI హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు మునిసిపల్ కార్మికులకు 26 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కనీస వేతనం పై తగిన నిర్ణయం చేయాలని లేనట్లయితే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టాలని సమావేశంలో నిర్ణయం చేశామని నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 17 నుండి 20 వరకు మున్సిపల్ కమిషనర్లకు సమస్యలతో కూడిన వినతి పత్రాలు ఇవ్వాలని, ఆయా మున్సిపాలిటీల పరిధిలోని పెండింగ్లో ఉన్న స్థానిక సమస్యలు పరిష్కరించని ఎడల మార్చి 4 మున్సిపల్ కార్యాలయాలను ముట్టడి చేపట్టాలని తీర్మానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర నర్శింహులు, యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు ఉప్పలయ్య, గుర్రం అశోక్, శ్రవణ్, రాజనర్సు ముక్కెర బుజ్జమ్మ, వెంకటస్వామి, యాదమ్మ, బారతమ్మ, యూనియన్ సీనియర్ నాయకులు అంజన్న, వివిద జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
