రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి మార్చి 04 (జాగో న్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గత రెండు రోజుల నుండి మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ప్రత్యామ్నాయంగా నీటిని ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తోంది. లక్షలు వెచ్చించి వేయించిన బోరు బావులు పనిచేయడం లేదు. కొన్నిచోట్ల పనిచేస్తున్న వాటికి కరెంటు సప్లై లేదు. ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు మంచినీటితో ఎన్ని పనులు ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయినా గత రెండు రోజుల నుండి గ్రామంలో మంచినీటి సరఫరా లేకపోవడంతో బావులు, బోరు బావులు అందుబాటులో లేనివారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కనీసం బాత్రూం కు వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి, లక్షలు వెచ్చించి నాయకులు బోరుబావులను వేశారు. వాటికి సంబంధించిన బిల్లులను తీసుకున్నారు. జనాలకు ఉపయోగం లేని బోరుబావులు యేసుడెందుకు.? అభివృద్ధి పేరు మీద ప్రజల డబ్బు వృధా ఖర్చు చేయడం ఎందుకు అంటూ ప్రజలు మండి పడుతున్నారు .ఈ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నిత్యం గ్రామపంచాయతీ నుండి నీటి సరఫరా చేయాలని లేని పక్షంలో గ్రామంలో ఉన్న బోరు బావులను ఉపయోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే గ్రామస్తులు కలిసి గ్రామపంచాయతీ ఎదుట నీటి కోసం నిరసనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మండల కేంద్రంలో ఇలాంటి పరిస్థితులే ఉంటే మరి గ్రామాల పరిస్థితి ఏంటి..? ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే గ్రామంలో నీటి సరఫరా అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
