*నిరుపేదలకు ఒక వరం..దేశంలోనే విప్లవాత్మకం…సన్న బియ్యం పంపిణీ..
*అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం..
*చొప్పదండీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్/రామడుగు, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్లవాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈ పథకం పేదలకు ఒక వరమని, ధనికులు తినే సన్నబియ్యాన్ని పేదలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్నారని తెలిపారు. ఇది ఒక గొప్ప అవకాశమని, ఈ పథకాన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకో వాలని సూచించారు.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని రామడుగు మండలం వేదిర గ్రామంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ సన్న బియ్యాన్ని లబ్దిదారులకు అందించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఈ పథకం నిరుపేదలకు ఒక వరమని, ఏ ప్రభుత్వం ఉన్నా సన్నబియ్యం పథకాన్ని అమలు చేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. ఆ విధంగా పేదల కోసం పకడ్బందీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ఇందుకు నిదర్శనమే సన్నబియ్యం పథకం ప్రారంభించడమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అసలు కలలో ఈ పథకం అమలు అవుతుందని ఊహించలేదని, ధనికులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఏ రాష్ట్రంలోనూ ఈ పథకం అమలు కావడం లేదని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రతినెలా 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందించడం జరుగుతుందని తెలిపారు. దేశ చరిత్రలోనే ఈ పథకం విప్లవాత్మక మైనదని, పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామని అన్నారు. పేదలు దొడ్డు బియ్యం తినలేరనీ, పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు సైక్లింగ్ చేస్తున్నారని తెలిపారు. వీటన్నింటికీ ముఖ్యమంత్రి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రతి పేదవారి ఇంటా ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీనీ ముఖ్యమంత్రి ప్రారంభించారని చెప్పారు. ఈ పథకాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా పకడ్బందీగా అమలు చేసి పేదవారికి అండగా ఉంటామని తెలిపారు. శ్రీమంతుల ఇండ్లకే పరిమితం అయిన సన్నబియ్యాన్ని ముఖ్యమంత్రి ఆలోచన మేరకు పేదలకు పంపిణి చేస్తున్నా మన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించి తీరుతుందన్నారు. సమాజంలో అణగారిన వర్గాల వారు, రైతు కూలీలు, మహిళలు, బీసీలు, దళితులకు ఆహారం పెట్టే మంచి పథకమని, ఇది నిజమైన ఆహార భద్రత పథకం అని పేర్కొన్నారు. భారతదేశం తెలంగాణ వైపు చూసేలా ఈ పథకాన్ని అమలు చేస్తామని, ఏ రాష్ట్రంలో సన్న బియ్యం పథకం అమలు చేయడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వనుందని, ఇది నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ పేదలకు సమృద్దిగా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తామని తెలిపారు. జిల్లాలోని రేషన్ షాప్ ల ద్వారా తెల్ల కార్డుదారులకు ఇక నుంచి ప్రతి నెలా సన్న బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ తెలిపారు. వానాకాలం వరి పంట కొనుగోలు సమయంలో రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించి సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న చౌక ధరల దుకాణాల ద్వారా ఇక నుంచి సన్న రకం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగు తుందని, దీనికీ అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను 150 కి పైగా పెంచామని పేర్కొన్నారు. పేదలందరూ సన్న బియ్యం పథకాన్ని వినియోగించు కోవాలని సూచించారు. ప్రభుత్వం పేదలకు ఆహార భద్రత కల్పిస్తుందని తెలిపారు.