కరీంనగర్, ఏప్రిల్ 03 (జాగో న్యూస్): తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ పెంచుతున్నామంటూ ప్రగల్బాలు పలికి, చట్టసభలో 42 శాతం బీసీలకు విద్యా,ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు కల్పిస్తామని బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని, అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టిన విధానమే ఒక మోసపూరిత చర్య అని ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎన్నం ప్రకాష్, బీజేపీ నాయకులు పెంట శ్రీనివాస్ తెలిపారు. గురువారం రోజున కరీంనగర్లో వారు మాట్లాడుతూ బీసీలను అనాదికాలం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూనే వస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఇప్పటివరకు ఉన్న కులాలతో పాటు అదనంగా కొత్త కులాలను చేర్చి జనాభా దామాషా పద్ధతిలో కాకుండా అశాస్త్రీయంగా బీసీలలోని వివిధ గ్రూపులను విభజించి అందులో వివిధ కులాలను చేర్చడమే కాకుండా, బీసీలను మోసం చేసే చర్యకు పాల్పడుతుందని ఆరోపించారు. బీసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త వివాదానికి తెర లేపడం చూస్తుంటే బీసీల మధ్య చిచ్చు పెట్టి ఓట్ల పబ్బం గడుపుకోవాలనే కుట్రపూరిత చర్య కనబడుతుందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో వెనుకబడిన తరగతులు అంటే ఈ దేశంలో ఉన్న వెనుకబడిన కులాలు మాత్రమేనని, అయితే ఎక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదని భారత రాజ్యాంగం ద్వారా వివిధ న్యాయస్థానాలలో తీర్పులు ఇచ్చిన కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచుతున్నామని చెప్తూనే బీసీ కులాలలో బీసీ (ఇ )పేరుతో ఒక కొత్త గ్రూపును చేర్చి దాన్లో మత ప్రాతిపదికన ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడం చూస్తుంటే గతంలో ఉన్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన శాతాన్ని తగ్గించడమేనన్నారు. ప్రధానంగా ఇందులో ముస్లిం మతానికి రిజర్వేషన్ అందించి బీసీలను మోసం చేస్తూ బీసీల జాబితాలో బిసి ఈ అనే పేరుతో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ పెంచడం మోసపూరిత చర్యగా వారు అభివర్ణించారు. ముస్లింలకు కేటాయించిన 10 శాతం బీసీ రిజర్వేషన్ తీసేస్తే బీసీలకు మిగిలేది కేవలం 32 శాతం మాత్రమేనని, గతంలో 29% లో నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ పేరుతో బీసీ రిజర్వేషన్ మింగి వేయడం చూసామని, అది సరిపోదన్నట్టుగా మళ్లీ ఇంకొక ఆరు శాతం కలిపి మొత్తం 10% బీసీఈ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇది పూర్తిగా వెనుకబడిన కులాలను, తరగతులను మోసం చేస్తూ , వారికి తీవ్ర అన్యాయం చేయడమేనన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు పక్కకు పెట్టి జనాభా దామాషా ప్రకారం బీసీలకు దక్కాల్సిన బీసీ రిజర్వేషన్లను పెంచాలని, వెంటనే రాష్ట్ర చట్టసభల్లోనే నిర్ణయం తీసుకోవాలని, బీసీ రిజర్వేషన్ల పెంపుతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని , అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సిన చర్య అని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ముస్లిం మత ప్రాతిపదికన కేటాయించిన బీసీఈ 10 శాతం రిజర్వేషన్ తొలగించి, కేవలం బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో పెంచాలని ఎన్నం ప్రకాష్, పెంట శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు.









