*పోస్టుల భర్తీలో రిజర్వేషన్ తప్పనిసరి
*సివిల్ రైట్స్ డే ద్వారా అవగాహన కల్పించాలి
*సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తే చర్యలు
*తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
కరీంనగర్, ఏప్రిల్ 03 (జాగో న్యూస్): వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30 లోగా పరిష్కరించాలని, ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, జిల్లా అధికారులతో ల్యాండ్, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ తదితర అంశాలపై కమిషన్ చైర్మన్, సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30 లోగా పరిష్కరించాలని అన్నారు. అట్రాసిటీ కేసులు కోర్టులో నిలబడే విధంగా బలమైన సాక్ష్యాలను పోలీసులు సమర్పించి నిందితులకు శిక్షపడేలా చూడాలని కోరారు. కోర్టు స్థాయిలో పెండింగ్లో ఉన్న కేసులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమీక్షించి త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చూడాలని అన్నారు. అట్రాసిటీ కేసుల్లో వైద్య ఆరోగ్య శాఖ నుండి పెండింగ్ లో ఉన్న అవసరమైన వైద్య నివేదికలు వెంటనే పంపాలని ఆదేశించారు. కులం సర్టిఫికెట్ సమర్పించని కారణంగా పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి వెంటనే సంబంధిత సర్టిఫికెట్ జారీ చేయాలని తహసిల్దార్లకు సూచించారు. రెవెన్యూ శాఖ పరిధిలో పెండింగ్లో ఉన్న భూమి సంబంధిత కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలని ఆర్డీవోలను ఆదేశించారు. అంబేద్కర్ విద్యా నిధి పథకం కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో కులాంతర వివాహ ప్రోత్సాహకాలకు కావలసిన బడ్జెట్ వివరాలు సమర్పిస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ లోను ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించినా, ఇతర కార్యక్రమాలకు మళ్లించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీలో, ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని, రిజర్వేషన్ రిజిస్టర్ ను తనిఖీ చేస్తామని తెలిపారు. ప్రతి నెలా గ్రామంలో సివిల్ రైట్స్ డే నిర్వహించి గ్రామస్తులందరిని చైతన్య పరచాలని సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశానికి జిల్లాస్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఎజెండా తమకు పంపించాలని అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఏవైనా వసతులు, సౌకర్యాలు అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అవలంబించాలని, ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని పోలీసు శాఖకు సూచించారు. కరీంనగర్ బాలసదనంలో పెరిగిన అనాధ ఎస్సీ యువతికి వివాహం జరిపించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని, జిల్లా సంక్షేమ అధికారి సబితను ప్రత్యేకంగా అభినందించారు. వివిధ శాఖల వారీగా ఎస్సీ, ఎస్టీ నిధుల కేటాయింపు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, ప్రపుల్ దేశాయ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్, ఆర్డీవోలు జిల్లా స్థాయి అధికారులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.









