*తక్షణ చర్యల కింద రోడ్డుకు అడ్డుగా ఉన్న పిచ్చి మొక్కలు, చెట్లను వెంటనే తొలగించి , మట్టి రోడ్డునైనా వేయండి..
*ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ తో శ్రీ వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు చిందం నరసయ్య, బొంతల కళ్యాణ్ చంద్ర
కరీంనగర్/తిమ్మాపూర్, ఏప్రిల్ 07 (జాగో న్యూస్): కరీంనగర్ నగరపాలక సంస్థ కు ముఖ ద్వారం, పట్టణ ప్రారంభ ప్రాంత కాలనీ (8వ డివిజన్ అల్గునూరు, శ్రీ వెంకటేశ్వర కాలనీ, కరీంనగర్- హైదరాబాద్ రాజీవ్ రహదారికి సమీప ప్రాంతం), అనేక ప్రభుత్వ కార్యాలయాలు కలిగి ఉన్న ముఖ్యమైన ఏకైక ప్రధాన రహదారి నిర్లక్ష్యానికి గురవుతుందని, 40 సంవత్సరాలుగా ఏలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని, ఇట్టి రోడ్డును రెండు వరుసల రహదారిగా మార్చడానికి చర్యలు తీసుకుని, ఇక్కడి ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ను ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు శ్రీ వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షులు చిందం నరసయ్య, ప్రధాన కార్యదర్శి బొంతల కళ్యాణ్ చంద్ర లు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఇక్కడి ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర కాలనీతో పాటు, హుస్సేన్ నగర్, క్రిస్టియన్ కాలనీ, వినాయక నగర్, చేపల కాలనీ, తమిళ కాలనీలు ఉన్నాయని తెలిపారు. తమ ప్రాంతంతోపాటు ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి ఉన్న ఏకైక ముఖ్యమైన ఇట్టి ప్రధాన రహదారి వెంటే ఎస్ ఆర్ ఎస్ పి (ఎల్ఎండి కాలనీ) కార్యాలయాలు, అలుగునూరు విద్యుత్ సబ్ స్టేషన్, పే అండ్ అకౌంట్ ఆఫీస్, భూగర్భ జల శాఖ, మండల విద్యాధికారి కార్యాలయం, టీచర్ ట్రైనింగ్ సెంటర్, మానసిక వికలాంగుల పాఠశాల, బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లాంటి ఎన్నో ముఖ్యమైన కార్యాలయాలు, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ రామ సాయి దేవాలయం ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు కలిగి ఉండి, అన్ని ప్రాంతాలను కలిపే విధంగా కాలనీ ప్రధాన రహదారి ఉండడంతో అనునిత్యం ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు కొనసాగించే వారు అధికంగా ఉంటారని తెలిపారు. కానీ కాలనీ ప్రధాన రహదారి మాత్రం నేడు కేవలం 10 ఫీట్ల వెడల్పుతో ఉండి, కంకర తేలిపోయి, రహదారి చుట్టూ దట్టమైన చెట్లు, పిచ్చి మొక్కలతో రోడ్డు కమ్ముకపోయి ప్రమాదకరంగా మారిందని తెలిపారు. దీంతో వాహనదారులు ప్రజలు రాకపోకలు కొనసాగించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనికి తోడు రాత్రివేళ ఇక్కడి ప్రాంతంలో వీధి దీపాలు లేకపోవడంతో స్థానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు . ముఖ్యమైన ఇట్టి రహదారిని అభివృద్ధి చేయాలని గత ఐదు సంవత్సరాలుగా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఫిర్యాదు చేసిన ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. కార్పొరేషన్ లో తమ కాలనీని విలీనం చేసి నేటికీ ఐదు సంవత్సరాలు గడిచిపోయాయని, కనీసం రోడ్డుకు అడ్డంగా అస్తవ్యస్తంగా ఉన్న పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోలేదన్నారు. ప్రధానంగా తమ కాలనీ తో పాటు అనుబంధంగా ఉన్న అనేక ప్రాంతాలకు ఉన్న ఏకైక ముఖ్యమైన ఇట్టి రహదారి అభివృద్ధి పై దృష్టి సారించి, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడి రోడ్డును రెండు వరుసలతో, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థతో ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం తక్షణ చర్యల కింద రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించి, మట్టితో నైనా రహదారిని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను కోరారు.