కరీంనగర్, జూన్ 01 (జాగో న్యూస్): హైదరాబాద్ లో జరిగిన బీసీల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి కరీంనగర్ జిల్లా నుండి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ లు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ లోనీ బంజారాహిల్స్ లో గల కళింగభవన్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ లో చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని డిమాండు చేశారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులలో కూడా బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశం ఇవ్వాలని కోరారు. జిల్లా, మండల స్థాయిలో బీసీ వాదం బలంగా నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి రాష్ట్ర ఉపాధ్యకుడు గ్రీకు రవీందర్, మోటుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
