కరీంనగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు- ఎన్నికల అధికారులు, ఈ ఆర్ ఓ లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారిగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని, కేటగిరీ A లో 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ B లో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ C లో 1987 నుంచి 2002 మద్యలో జన్మించి 2025 ఓటరు జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ D లో 2002-2007 మధ్యలో జన్మించిన వారిగా విభజించడం జరిగిందని తెలిపారు. మొదట కేటగిరి A జాబితాను బి ఎల్ ఓ యాప్ ద్వారా నిర్ధారించుకోవడం జరుగుతుందని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల ఓటర్లను నిర్ధారించడం జరిగిందని, మిగిలిన 12 లక్షల ఓటర్ల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. కేటగిరి C, క్యాటగిరి D లలోని ఓటర్లను కేటగిరి A కు మ్యాపింగ్ చేసే ప్రక్రియను మెరుగుపరచాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు పాల్గొన్నారు.








