కరీంనగర్: ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీలు పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లక్ష్మీ కిరణ్ (రెవెన్యూ), అశ్విని తానాజీ వాకడే(స్థానిక సంస్థలు), నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్ , డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 369 మంది అర్జీదారులు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు, ఇళ్ల వివరాలు, చనిపోయిన జంతువుల వివరాలు ఎస్డీఆర్ఎఫ్ కింద నమోదు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. దెబ్బతిన్న భవనాలు, ట్యాంకులు, రోడ్ల వివరాలు నమోదు చేయాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖలను ఆదేశించారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ఆవరణలను శుభ్రం చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు.

								
															
															






